కలం, కరీంనగర్ బ్యూరో: గర్భధారణలో డెలివరీ సాధారణంగా 37 నుంచి 42 వారాల మధ్య జరుగుతుంది. కానీ కొంత మంది గర్భిణీ స్త్రీలకు నెలలు పూర్తిగా నిండకముందే నొప్పులు రావడంతో ముందస్తు డెలివరీ చేయాల్సి వస్తుంది. ముందస్తు డెలివరీ చేయడం వలన తల్లికి, శిశువుకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో నెలలు నిండకుండా జన్మించిన నవజాత శిశువుకు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లా, ఓదెల మండలంలోని పొత్కపల్లి గ్రామానికి చెందిన శ్యామల 33 వారాలకే తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరి పండంటి బాబుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండా జన్మించిన నవజాత శిశువు ఊపిరితిత్తులు పూడుకపోవడంతో డాక్టర్లు తల్లిదండ్రుల అనుమతితో శస్త్ర చికిత్స చేశారు. శిశువుకు ‘రెస్పెటరీ డిస్రెస్’ వ్యాధి (Respiratory Distress) సోకడంతో ‘సర్ఫ్యాక్ట్ ఆంట్ ఇంజక్షన్’ఇవ్వడం ద్వారా బాబు ప్రాణాలను కాపాడినట్లు డీసీహెచ్ ఎస్.శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రిలో 800 మంది నవజాత శిశువులకు ప్రత్యేక చికిత్స ద్వారా నయం చేసినట్లు తెలిపారు. ఈ చికిత్స ద్వారా దాదాపు రూ.2 లక్షలు ఆదా అయినట్లు ఆయన తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం ఉంచి వైద్యం చేయించుకోవాలని కోరారు.
Read Also: బీఆర్ఎస్ ప్లీనరీపై సస్పెన్స్.. కవిత కొత్త పార్టీ ఎఫెక్ట్ !!
Follow Us On : WhatsApp

