కలం, వెబ్ డెస్క్: కాకినాడ (Kakinada) జిల్లా గంగనాపల్లికి చెందిన బాలాజీ, హెమిమా దంపతుల కుమారుడు మోజెస్రాయ్ ఉన్నాడు. ఈ బాలుడు అరుదైన ‘స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-2‘ వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. జన్యులోపం కారణంగా సంభవించే ఈ వ్యాధి వల్ల బాలుడి కండరాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. దీనికి విరుగుడుగా వెన్నెముకకు ఇచ్చే ‘జోల్జెస్మా’ (Zolgensma) ఇంజెక్షన్ ఒక్కటే మార్గమని వైద్యులు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది. దీని ధర సుమారు రూ. 16 కోట్లు. అంత డబ్బు భరించలేక ఆ పేద తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
తమ బిడ్డను కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం కాకినాడ కలెక్టర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు ఆర్థిక స్తోమత లేదని, ప్రభుత్వం లేదా దాతలు స్పందించి ఉదారంగా సాయం చేయాలని కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి ప్రాణాలను నిలిపేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతర మార్గాల ద్వారా నిధులు మంజూరు చేయాలని వేడుకున్నారు.

