కలం, వెబ్ డెస్క్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ (Ramzan) మాసం ప్రారంభమైంది. బుధవారం రాత్రి ఆకాశంలో చంద్రవంక కనిపించిందని మక్కా మసీదు నుంచి రంజాన్ మాసం సైరన్ మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు గురువారం తెల్లవారుజాము నుంచే ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షాలు తెలియజేశారు.
ఈ పవిత్రమైన నెల సమాజంలో ఐక్యత భావాన్ని మరింత బలపరచాలని మోడీ (Modi) ఆకాంక్షించారు. అంతటా శాంతి, సౌభాగ్యం నెలకొనాలని పేర్కొంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక సీఎం చంద్రబాబు (Chandrababu)తన పోస్టులో పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. దివ్య ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రతినిత్యం ప్రార్థనలు, పేదలకు దానధర్మాలు చేస్తూ, ఆధ్యాత్మిక చింతనతో నియమనిష్ఠలతో ముందుకు సాగుతారన్నారు. వారి దీక్ష పవిత్రంగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
రంజాన్ (Ramzan) మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. పవిత్రమైన రంజాన్ మాసం అందరికీ సహనం, దయ, క్షమ, సేవా భావం నేర్పించే ఆధ్యాత్మిక కాలం అని తెలిపారు. ఈ పవిత్ర మాసంలో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి ఉపవాసం, ప్రతి మంచి కార్యం అల్లా కృపతో ఫలించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ పవిత్ర రంజాన్ అందరి జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం నింపాలని ప్రార్థించారు.
Read Also: కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం
Follow Us On: Sharechat


