కలం, వెబ్ డెస్క్: ఏపీలో రెండేళ్లలో క్రీడలు, యువజన రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Ramprasad Reddy) స్పష్టం చేశారు. గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు సారధ్యంలో యువత, క్రీడాకారుల భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడిందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో లీగ్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో మూతపడిన క్రీడా అకాడమీలను తిరిగి ప్రారంభించి 13 క్రీడా విభాగాల్లో శిక్షణ అందిస్తున్నామని ప్రకటించారు. ఇప్పటివరకు 46 క్రీడా కేంద్రాలు పూర్తయ్యాయని, మరో 91 పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమరావతి ఛాంపియన్షిప్లు, పారా బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి పలు జాతీయ స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు.
ఆడుదాం ఆంధ్రా విజిలెన్స్ నివేదిక త్వరలోనే బయటకు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అమల్లో ఎలాంటి సూక్ష్మ లోపాలు లేవని స్పష్టం చేశారు. క్రీడల కోటాలో 3 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత రెండేళ్లలో 800 మందికి పైగా ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఖేలో ఇండియా పథకం నిధులతో రాష్ట్రంలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

