కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (Karimnagar Warangal Highway) నిర్మాణంలో భాగంగా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఇరువైపులా ర్యాంప్ ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న విజ్ఞప్తికి మోక్షం లభించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో హైవే అధికారులు స్పందించి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గతంలో కొత్తగట్టు గ్రామ ప్రజలు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసి తమ ప్రాంతంలో రహదారి ఇరువైపులా ర్యాంప్ను ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ర్యాంప్ లేకపోవడం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని వారు వివరించారు. ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ కుమార్, ఇటీవల హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ కు కొత్తగట్టు ప్రాంత సమస్య పరిష్కరించాలని సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రహదారికి ఇరువైపులా ర్యాంప్ను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి ర్యాంప్ నిర్మాణానికి అవసరమైన చర్యలను ప్రారంభించారు. దీనితో కొత్తగట్టు, చుట్టుపక్కల గ్రామస్తుల రవాణా ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

