కలం, వెబ్ డెస్క్: కేంద్రంలోని ప్రధాని మోదీ పాలనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్ రావు (Ramchander Rao) ప్రసంశలు కురిపించారు. ప్రధాని మోదీ హయాంలో అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని కొనియాడారు. పన్నెండేళ్ల క్రితం రాబోయే దశాబ్దంలో భారత్ అనేక విజయాలు సాధిస్తుందని ఎవరైనా చెప్పి ఉంటే.. దాన్ని ప్రజలు అసాధ్యమని భావించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తుందని, రామ మందిరం నిర్మాణం జరుగుతుందని, ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని, ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్, అవినీతి రహిత పాలన, దేశంలోని ప్రతి మూలకు విద్యుత్ అందుతుందని చెప్పి ఉంటే అసాధ్యమని భావించేవారని.. ప్రధాని మోదీ (PM Modi) ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కొనియాడారు. అయోద్యలో రామ మందిర నిర్మాణం నుంచి కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాల్ కారిడార్ పునర్నిర్మాణం వరకు.. యూపీఐ, డిజిటల్ ఎకానమీ నుంచి జామ్ త్రయం- జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా ఆర్థిక సమగ్రత వరకు, భారత్ చారిత్రాత్మక మార్పును చూసిందని చెప్పారు.
జీఎస్టీ, జన్ ధన్ యోజనతో పెనుమార్పు..
దేశంలో జన్ ధన్ యోజన పథకం ద్వారా దాదాపు 50 కోట్ల మంది ప్రజలు బ్యాంక్ అకౌంట్లు తెరిచారని చెప్పారు. ముద్రా రుణాలు చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక బలం ఇచ్చాయని పేర్కొన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాల ప్రయోజనాలు మధ్యవర్తులు లేకుండా నేరుగా పేదల ఖాతాల్లోకి చేరాయని చెప్పారు. మౌలిక వసతుల రంగంలో కూడా భారత్ అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రికార్డు స్థాయిలో రహదారులు, ఎక్స్ప్రెస్వేలు, గ్రామీణ రహదారుల నిర్మాణం, రైల్వే నెట్వర్క్ విస్తరణ – ఆధునికీకరణ, మేడ్ ఇన్ ఇండియా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం, సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసిన UDAN పథకం..ఇవన్నీ నూతన భారత నిర్మాణానికి నిదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. జీఎస్టీ (GST) వంటి సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత క్రమబద్ధం చేసిందని కొనియాడారు.

