కలం, కరీంనగర్ బ్యూరో : పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Koya Sriharsha) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి జూన్ 10 నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యాలయ నిర్వహణకు అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, తాగునీటి తదితర మౌలిక సదుపాయాలను కూడా అదే గడువులో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అధికారులు తరచూ పనులను పర్యవేక్షిస్తూ పనుల పురోగతిని సమీక్షించాలని కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కార్యాలయ భవనం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఈఈ పీఆర్ శంకరయ్య, తహసీల్దార్ సునీత ఉన్నారు.

