కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం అనేక మలుపులు తిరుగుతోంది. ఇజ్రాయెల్ సాయంతో ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ అమెరికాను టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోగల శక్తివంతమైన క్షిపణి ఇంజిన్ పరీక్షను ఉత్తర కొరియా విజయవంతంగా నిర్వహించడం ఆందోళన కలిగిస్తోంది. 2026 మార్చి 29న కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో జరిగిన ఈ హై-థ్రస్ట్ సాలిడ్-ఫ్యూయల్ ఇంజిన్ పరీక్ష, అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించే సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రాధాన్యతలను మార్చుకున్నారని, అమెరికాకు అసలైన ముప్పుగా ఉన్న ఉత్తర కొరియాను వదిలి ఇరాన్పై అనవసర యుద్ధానికి మొగ్గు చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత దేశ ప్రయోజనాల కంటే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ విస్తరణ ఆకాంక్షలకే ట్రంప్ పెద్దపీట వేస్తున్నారని, ఇది అమెరికా భద్రతను పణంగా పెట్టడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చమురు రక్షణలో భాగంగా ఇరాన్ ఒకవైపు అమెరికా దాడులను తిప్పికొడుతుంటే.. మరోవైపు కిమ్ అమెరికాను టార్గెట్ చేయడం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఘటనపై ట్రంప్ ఏవిధంగా రియాక్ట్ అవుతాడు అనేది వేచి చూడాల్సిందే.

