కలం, సినిమా : టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’(Peddi) సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక ప్రీమియర్ షోలను కూడా ప్లాన్ చేశారు. జూన్ 3న రాత్రి 8 గంటలకు నిర్వహించనున్న ప్రీమియర్ షో టికెట్ ధరను GSTతో కలిపి రూ.600గా నిర్ణయించారు. ఈ రేటు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అలాగే జూన్ 4 నుంచి జూన్ 13 వరకు మొత్తం 10 రోజుల పాటు సాధారణ టికెట్ ధరలపై అదనపు పెంపు అమలులో ఉండనుంది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ.100 పెంపుతో ధర రూ.247.50కి చేరుకోనుంది. ఇక మల్టీప్లెక్స్లలో రూ.125 అదనంగా వసూలు చేయడంతో టికెట్ ధర రూ.302గా ఉండనుంది. సినిమాపై ఉన్న భారీ హైప్ కారణంగా ఈ ధరల పెంపు చేసినప్పటికీ, సాధారణ ప్రేక్షకులు మాత్రం టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం ప్రీమియర్ షో కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పెద్ది’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

