కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్కు (MI) షాక్ తగిలింది! వర్షం ఆటంకం కలిగించిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. యశస్వి జైస్వాల్ వీరవిహారం, చిన్నారి సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మెరుపులతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, ముంబైకి ఇది రెండో ఓటమిగా నమోదైంది. ఈ ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్యా.. తప్పంతా బౌలర్లదే అన్నారు. బ్యాటర్లది తప్పేమీ లేదని వెనకేసుకువచ్చారు. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన జట్టు ప్రదర్శనపై స్పందించారు.
ఈ ఓటమికి బ్యాటింగ్ కంటే బౌలింగ్ విభాగమే బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 27 పరుగుల తేడాతో ఓడిపోవడం అంటే కేవలం ఐదు మంచి బంతులు వేయలేకపోవడమేనని వివరించారు. బుమ్రా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ వంటి సీనియర్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటర్లు దూకుడుగా ఆడి వికెట్లు కోల్పోవడాన్ని తప్పు పట్టలేమని, బౌలర్లు తమ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయారని పాండ్యా పేర్కొన్నారు.
గౌహతి వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్కు వర్షం కారణంగా రెండు గంటల ఆలస్యంగా మొదలైంది. దీంతో అంపైర్లు ఆటను ఇరు జట్లకు 11 ఓవర్ల చొప్పున కుదించారు. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రాజస్థాన్ ఓపెనర్లు ఆది నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సూర్యవంశీ 39 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, యశస్వి జైస్వాల్ మాత్రం తగ్గలేదు. జైస్వాల్ కేవలం కొద్ది ఓవర్లలోనే 77 పరుగులతో నాటౌట్గా నిలిచి, రాజస్థాన్కు 150 పరుగుల భారీ స్కోరును అందించాడు. 151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే తడబడింది. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాటర్లు మొదటి ఐదు ఓవర్లలోనే పెవిలియన్ చేరారు. నిర్ణీత 11 ఓవర్లలో ముంబై 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా రాజస్థాన్ 27 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Read Also: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు.. వార్నర్కు ఎన్ఎస్డబ్ల్యూ మద్దతు
Follow Us On : WhatsApp

