కలం, వెబ్ డెస్క్ : రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం డీగ్ జిల్లాలో జరిగిన ఒక వివాహం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా పెళ్లిళ్లలో పూలదండలు మార్చుకోవడం ఆచారంగా వస్తోంది. కానీ ఈ పెళ్లిలో మాత్రం వరుడికి కళ్ళు చెదిరే రీతిలో భారీ కరెన్సీ దండతో స్వాగతం పలికారు. ఏకంగా 500 రూపాయల నోట్లతో రూపొందించిన 100 అడుగుల పొడవైన దండను వరుడి మెడలో వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
వరుడిని ఒక భవనం పైకి తీసుకువెళ్లి, అక్కడ నుంచి ఈ భారీ నోట్ల దండను కిందికి వేలాడదీస్తూ అతనికి అలంకరించారు. అల్లుడిపై తమకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుకోవడానికి పెళ్లి కుమార్తె తరపు వారు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. మేవాత్ ప్రాంతంలో ఇలాంటి సంప్రదాయాలు పాటించడం తమ సామాజిక హోదాకు, ప్రతిష్టకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ అసాధారణ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని ఒక వింత ఆచారంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు ఇంత భారీ స్థాయిలో నగదును ప్రదర్శించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ 100 అడుగుల నోట్ల దండ ఆ వివాహ వేడుకలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

