కలం, వెబ్ డెస్క్: రేపు దేశ వ్యాప్తంగా నీట్ రీ-ఎగ్జామ్ జరగబోతున్న నేపథ్యంలో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యంగా పరీక్ష రాయాలని, ఏం జరిగినా మీతో ఉంటామని, మిమ్మల్ని రక్షించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈ సారైనా తప్పులు లేకుండా పరీక్ష జరిగేలా చూడండి. ఇప్పటివరకు విద్యార్థులు అనుభవించిన తీవ్రమైన ఒత్తిడి చాలు. మళ్లీ మనో వేదన చెందడానికి సిద్ధంగా లేరు. ఏ ఒక్కరి కల కూడా చెదిరిపోవడానికి వీల్లేదు’ అని కోరారు. పరీక్ష లీకేజీ తరువాత రాహుల్ గాంధీ పలు ప్రాంతాల్లో పోరాటాలు నిర్వహించి, విద్యా శాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న మాక్ డ్రిల్..
రేపటి నీట్ పరీక్ష (NEET Exam) నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్టీఏ (NTA) చేపట్టిన మాక్ డ్రిల్ కొనసాగుతోంది. పరీక్ష పేపర్ల తరలింపు సహా ప్రతీ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి గదిలో రెండేసి సీసీ కెమెరాలను అమర్చారు. వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. పరీక్షా కేంద్రానికి చుట్టు పక్కల హై అలర్ట్ ప్రకటించడంతో పాటు టెక్నాలజీ ఆధారిత అంశాలపై సైబర్ నిఘా పెట్టారు. ఇప్పటికే టెలిగ్రామ్ను కూడా తాత్కాలికంగా నిషేధించిన కేంద్రం.. ఇతర యాప్లపై కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తోంది.
Read Also: ఇండియా స్థానంలో భారత్.. యూనివర్సిటీ డిగ్రీల్లో మార్పు!
Follow Us On: Instagram

