కలం, వెబ్ డెస్క్: ఇండియా స్థానంలో “భారత్” (Bharat) అని కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో యూనివర్సిటీలు ఇక నుంచి దీన్నే పాటించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్ జబల్పుర్లోని రాణీ దుర్గావతి యూనివర్సిటీ స్నాతకోత్సవం రేపు జరగబోతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండగా.. విద్యార్థులకు జారీ చేసే డిగ్రీ పట్టాల్లో ఇండియా స్థానంలో భారత్ అని ముద్రించినట్లు వైస్ ఛాన్స్లర్ రాజేశ్ కుమార్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు వర్సిటీ పాలకమండలి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వివరించారు. ‘ఇక నుంచి డిగ్రీ మార్క్షీట్లపై భారత్ అనే ఉండబోతుంది. మన దేశం అసలు పేరు భారత్. ఇండియా అనేది తరువాత వచ్చింది. జీ20 సదస్సు కూడా భారత్ పేరు మీదుగానే నిర్వహించారు’ అని పేర్కొన్నారు.
ఆ రెండు కూడా అదే దారిలో..
మధ్యప్రదేశ్ ఇండోర్లోని దేవీ అహిల్యా విశ్వవిద్యాలయం కూడా ఇదే తరహా తీర్మానం జారీ చేసింది. ‘భారత్ అని పెట్టాలని నిర్ణయించుకున్న రాష్ట్రంలో మొదటి యూనివర్సిటీ మాదే. ఇప్పటికే ఇండియా ఉన్న చోట్ భారత్ అని మార్చేశాం. రాబోయే రోజుల్లో అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే పాటిస్తాయని భావిస్తున్నాం’ అని వైస్ ఛాన్స్లర్ రాకేశ్ సింఘాయ్ వెల్లడించారు. గ్వాలియర్లోని రాజా మాన్సింగ్ తోమర్ కళల విశ్వవిద్యాలయం, ఛత్తీస్గఢ్ బిలాస్పుర్లోని గురు ఘాసీదాస్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి మార్పు చేసినట్లు వీసీలు వివరించారు.
ఇలా మార్చుకోవచ్చా..
యూనివర్సిటీల నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే, రాజ్యాంగంలో రెండు రకాల పేర్లను పేర్కొన్నారు. ఇండియా అంటే భారత్ అని స్పష్టంగా నిర్వచించారు. సాధారంగా ఇంగ్లీషులో ఇండియా, హిందీలో భారత్ అని పిలవడం ఎప్పటినుంచో వస్తున్నదే అని నిపుణులు చెబుతున్నారు. యూనివర్సిటీలు కొత్తగా మార్చుకోవడం వలన లాభ నష్టాలు ఏమీ లేవని విశ్లేషిస్తున్నారు. 2023లో జీ20 సదస్సు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఛైర్ దగ్గర “ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని రాయడంతో చర్చ మొదలైంది.

