కలం, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీకుల (NEET Paper Leaks)పై ప్రధాని మోదీ (PM Modi)ఎందుకు మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు. నీట్ పరీక్షల్లో జరుగుతున్న తప్పిదాలపై కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకులపై ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. ఈ మేరకు నేడు రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. 2024లో నీట్ పేపర్ లీక్ అయినప్పుడు పరీక్షను రద్దు చేయలేదని, మంత్రి రాజీనామా చేయలేదని… కేవలం సీబీఐ విచారణ, ఒక కమిటీ ఏర్పాటుతో సరిపెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు 2026లో మళ్లీ పేపర్ లీక్ అయి పరీక్ష రద్దయినా, కేంద్ర విద్యా శాఖ మంత్రి మాత్రం ఇంకా రాజీనామా చేయలేదని, మళ్లీ పాత ఫార్మూలా ప్రకారమే సీబీఐ విచారణ, మరో కమిటీ ఏర్పాటు అంటున్నారని ఎద్దేవా చేశారు.
దేశ వ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది నీట్ విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటూ వారిని దారుణంగా వంచించిందని రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. దేశంలో ఇలా పరీక్షల ప్రశ్నాపత్రాలు పదేపదే ఎందుకు లీక్ అవుతున్నాయో ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో నిరంతరం విఫలమవుతూ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి ఎందుకు తొలగించడం లేదని నిలదీశారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా తన మౌనాన్ని వీడి విద్యా శాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలని, లేదా ఈ వైఫల్యానికి పూర్తి వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని తన పోస్టులో #SackPradhan అనే హ్యాష్ ట్యాగ్ను ప్రత్యేకంగా మెన్షన్ చేశారు.
Read Also: డైనోసార్ల ప్రపంచంలోకి నారా దేవాన్ష్: నారా లోకేశ్ ఆసక్తికర పోస్ట్!
Follow Us On: X(Twitter)

