కలం, నకిరేకల్ : నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం పరిధిలోని అయిటిపాముల (Aitipamula) గ్రామంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala), ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) ఆదివారం సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియ, తూకం విధానం, అలాగే లారీల ద్వారా ధాన్యం తరలింపు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు, ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటలలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) సూచించారు. కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, విశ్రాంతి స్థలాలు వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా తగిన తార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, అలాగే దళారుల ప్రమేయం లేకుండా పూర్తిగా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
Read Also: జిల్లాలకు మంత్రులు వెళ్లి కొనుగోళ్లను పర్యవేక్షించాలి: కిషన్ రెడ్డి
Follow Us On: Instagram

