కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee)పై జరిగిన దాడిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఓ ప్రజాప్రతినిధిపై దాడి చేయడం అంటే ఆయనను ఎన్నుకున్న ప్రజలను, మన ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనన్నారు. ఇటువంటి హింసా రాజకీయాలు బీజేపీ (BJP) ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఎన్నటికీ భౌతిక దాడులకు దారితీయకూడదని పేర్కొన్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల భద్రతకు భరోసా కల్పించాలని కోరుతూ, గాయపడిన అభిషేక్ బెనర్జీ త్వరగా కోలుకోవాలని రాహుల్ ఆకాంక్షించారు.

