కలం, వెబ్ డెస్క్ : తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) స్పందించారు. అదంతా ఫేక్ ప్రచారం చేశామని.. కొంత మంది కావాలనే ఇలాంటి అర్థం పర్థం లేని అసత్య ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తాను స్థాపించిన ‘తెలుగువీర లేవరా ‘ ఫోరానికి, రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ప్రజలకు ఉచితంగా సేవలు అందించేలా సామాజిక దృక్పథంతో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ‘తెలుగువీర లేవరా’ అనే సొసైటీ తీసుకొచ్చినట్లు రఘురామకృష్ణరాజు వివరించారు. కొంతమంది న్యాయవాదులను సభ్యులుగా ఈ సొసైటీ చేర్చామని వెల్లడించారు. అయితే ప్రజలకు సేవ చేయడానికి ఉద్దేశించిన ‘తెలుగు వీర లేవరా’ సొసైటీ పై అబద్ధపు ప్రచారాలు చేయొద్దని కోరారు. తెలుగు వీర లేవరా అనేది కేవలం ఫోరం మాత్రమేనని, న్యాయపరమైన సహాయం అవసరమైన వారికి ఉచితంగా సేవలు అందించేందుకు ఉద్దేశించినదని తేల్చారు. ప్రస్తుతం తాను టీడీపీ పార్టీలో చాలా సంతోషంగా ఉన్నానన్న రఘురామకృష్ణరాజు.. సీఎం చంద్రబాబుతో పాటుగా ఇతర నేతలతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

