కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలోని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) సమస్యలను శాసనసభలో ప్రస్తావించి పరిష్కరించేలా చూడాలని రాష్ట్ర పీవీటీజీల ఐక్య వేదిక భద్రాచలం (Bhadrachalam) ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతి పత్రం అందించింది. ఆదివారం భద్రాచలంలో ఎమ్మెల్యేను కలిసిన ఐక్యవేదిక ప్రతినిధులు, ఆదిమ గిరిజన తెగలైన చెంచు, కోలాం, తోటి, కొండరెడ్డి వర్గాల ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులు పట్టించుకోవడం లేదు..
ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ.. పీవీటీజీ కుటుంబాలకు నేటికీ విద్య, ఉపాధి, గృహ వసతి, భూ హక్కులు, కనీస మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నాయకులు ముర్ల రమేష్ రెడ్డి, నిమ్మల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

