కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి అప్రజాస్వామికమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దాడులతో అపహాస్యం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని పువ్వాడ తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వంలోనే ఉన్న పార్టీ నేతలు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి దాడులకు పాల్పడడం తగదని అన్నారు. ఈ విధమైన దాడులు, విధ్వంసాలతో ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయాలన్నది ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డ పువ్వాడ అజయ్ కుమార్, ఇప్పటికైనా ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని హితవు పలికారు.

