కలం, వెబ్ డెస్క్ : ఏటీఎఫ్-14 (గ్రేడ్-ఏ) దక్షిణాసియా టెన్నిస్ టోర్నమెంట్లో (South Asia Tennis Tournament) యువ ఆటగాడు పునీత్ మనోహర్ (Puneeth Manohar) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్న అతడు, ఇప్పుడు సింగిల్స్ ఫైనల్కు చేరి డబుల్ విజయానికి చేరువయ్యాడు. శుక్రవారం జరిగిన బాలుర డబుల్స్ ఫైనల్లో ఆరవ్ చల్లాని-పునీత్ మనోహర్ జోడీ విజేతగా నిలిచింది. థాయ్లాండ్కు చెందిన ఎస్. లావోమోర్మ్పానిచ్, హాంకాంగ్కు చెందిన హో వాన్ యెంగ్ జంటపై 4-6, 6-3, 10-6 తేడాతో గెలిచి టైటిల్ను సొంతం చేసుకుంది.
అనంతరం జరిగిన బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో పునీత్ మనోహర్ 6-1, 6-3 స్కోరుతో ఎస్. చింతగుమ్టాను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టాడు. మరో సెమీఫైనల్లో ఆరవ్ చల్లాని 6-3, 1-6, 6-2తో సుజయ్ పోతులపై విజయం సాధించాడు. దీంతో బాలుర సింగిల్స్ టైటిల్ కోసం పునీత్ మనోహర్, ఆరవ్ చల్లాని మధ్య తుది పోరు జరగనుంది. ఇక బాలికల సింగిల్స్ విభాగంలో పి. రమేశ్, జోహా ఖురేషి ఫైనల్కు చేరారు. సెమీఫైనల్లో జోహా ఖురేషి 6-4, 3-6, 7-6(8)తో ఎస్. మార్దానియాపై విజయం సాధించగా, మరో మ్యాచ్లో పి. రమేశ్ 6-2, 6-1తో పి. వట్టప్రంబిల్ను ఓడించింది. బాలికల డబుల్స్ ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన పి. డౌంగ్ఖియావ్ – పి. రమేశ్ జోడీ 6-3, 6-3తో పి. వట్టప్రంబిల్-కృషికా గౌతమ్ జంటపై గెలిచి టైటిల్ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో సింగిల్స్ ఫైనల్స్పై క్రీడాభిమానులలో ఉత్కంఠ నెలకొంది.

