కలం, వెబ్ డెస్క్: ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ (Oscars) వేదికపై భారతీయ నటి, గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) మరోసారి సందడి చేయనున్నారు. ఈ ఏడాది జరగనున్న 98వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఒక ప్రజెంటర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రియాంకా స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “ది 2026 అకాడమీ అవార్డ్స్” అంటూ ప్రజెంటర్ల జాబితాను ఆమె పోస్ట్ చేశారు.
ఆస్కార్ వేడుకలు మార్చి 15వ తేదీన ఘనంగా జరగనున్నాయి. ప్రముఖ కామెడీ స్టార్ కోనన్ ఓబ్రియన్ ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ వేదికపై ప్రియాంకతో పాటు హాలీవుడ్ దిగ్గజాలు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, గ్వైనెత్ పాల్ట్రో, అన్నే హాత్వే కూడా ప్రజెంటర్లుగా అలరించనున్నారు. ఇక ప్రియాంకా గతంలో రెండు సార్లు ఆస్కార్ వేడుకలకు వెళ్లారు. 2016లో ప్రజెంటర్గా ఒకసారి, 2017లో అతిథిగా మరోసారి వెళ్లారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ప్రజెంటర్గా వెళ్తుండటంతో ప్రియాంకా చోప్రా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.

