కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని మల్లాపూర్ (Mallapur) ప్రాంతంలో ఒక విస్తుపోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న జేపీ వైన్ షాప్లో ఒక వినియోగదారుడు కింగ్ఫిషర్ లైట్ బీర్ (beer bottle) కొనుగోలు చేయగా, అందులో ఏకంగా ఒక చేప పిల్ల కనిపించింది. సదరు వ్యక్తి బాటిల్ మూత తీసిన వెంటనే లోపల ఏదో కదులుతున్నట్లు గమనించి నిశితంగా పరిశీలించగా, అది బతికున్న చేప పిల్ల అని తేలడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
వెంటనే బాధితుడు ఈ విషయాన్ని వైన్ షాప్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లగా, వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం ఎదురైందని బాధితుడు ఆరోపించాడు. బీర్ తమ వద్ద తయారు కాదని, ఏవైనా లోపాలు ఉంటే నేరుగా తయారు చేసిన కంపెనీనే సంప్రదించాలని సిబ్బంది బాధ్యతారాహిత్యంగా మాట్లాడటంతో బాధితుడు విస్మయం వ్యక్తం చేశాడు. సీలు చేసిన బాటిల్లో చేప పిల్ల ఎలా వచ్చిందనే అంశం ఇప్పుడు మద్యం ప్రియుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మద్యం ప్రియులు మండిపడుతున్నారు.

