కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీయే కూటమి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దేశ ప్రజలే తనకు దేవుళ్లని, వారి ప్రేమాభిమానాలు, ఆత్మీయత తనకు లభిస్తున్న గొప్ప ఆశీర్వాదమని అన్నారు. ప్రజల విశ్వాసం, మద్దతే తనను నిరంతరం ప్రజాసేవ దిశగా ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. దేశ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని మోదీ చెప్పారు. తన నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ఎన్డీయే కూటమి సభ్యులు అభినందన తీర్మానం చేయడం తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు.
ఎన్డీయే కూటమి బలం ఐక్యతలోనే ఉందని ప్రధాని పేర్కొన్నారు. కూటమిలోని ప్రతి రాజకీయ పార్టీకి సమాన ప్రాధాన్యత ఉంటుందని, అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాలే తమ నిర్ణయాలకు కేంద్రబిందువుగా ఉంటాయని స్పష్టం చేశారు.
2014కు ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొనేదని మోదీ వ్యాఖ్యానించారు. తరచూ మారుతున్న రాజకీయ పరిస్థితులు, బలహీన ప్రభుత్వాల కారణంగా దేశ అభివృద్ధి దెబ్బతిన్నదని అన్నారు. అస్థిరత వల్ల దేశం అనేక అవకాశాలను కోల్పోయిందని అభిప్రాయపడ్డారు.
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని ప్రధాని గుర్తుచేశారు. అయితే ప్రతి పరిస్థితిని ప్రజల ఆశీర్వాదంతో అధిగమించానని తెలిపారు. అధికారాన్ని ఎప్పుడూ హోదాగా కాకుండా సేవకు అవకాశం గానే భావించానని చెప్పారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అభివృద్ధి వేగవంతమైందని మోదీ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, ఆర్థికాభివృద్ధి, ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠ పెంపు వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ (Modi) స్పష్టం చేశారు.
Read Also: భవిష్యత్ తరానికి బంగారు బాటగా ఫ్యూచర్ సిటీ: సీఎం రేవంత్
Follow Us On: Instagram

