కలం, వెబ్ డెస్క్: ప్రతి ఇంట్లో చిన్నా చితక రిపేర్లు ఉంటాయి. కానీ చిన్నదేగా అనో, ఖర్చు ఎక్కువ కదా అనో వాటిని సరి చేయించకుండా వాయిదా వేస్తుండటం సహజం. కానీ ఈ వాయిదే వేసే అలవాటు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని మీకు తెలుసా? మనం వాయిదా వేస్తూ వస్తున్న ఇంటి రిపేర్లు శ్వాసకోశ వ్యాధుల (Respiratory Diseases)కు కారణమయ్యే అవకాశం ఉంది ఎంతమందికి తెలుసు. ఇది నేను చెప్తున్నది కాదు.. తాజా పరిశోధన వెల్లడిస్తోంది. ఇళ్లలో ఉండే తేమ, తడి వల్ల శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయని, సరైన రిపేర్లు చేయించడం ద్వారా ఆ ముప్పును తగ్గించవచ్చని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఎనర్జీ అప్గ్రేడ్స్ చేసిన ఇళ్లలో ఉండేవారికి శ్వాసకోశ మందుల వాడకం తగ్గినట్లు వెల్లడైంది. నెదర్లాండ్స్ (Netherlands)లో దాదాపు 20 లక్షల మందిపై పదేళ్ల పాటు జరిపిన భారీ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
సాధారణంగా 1990 కంటే ముందు నిర్మించిన పాత ఇళ్లలో ఇన్సులేషన్, వెంటిలేషన్ లోపం వల్ల తేమ చేరుతుంది. ఇది బూజు (Mould), అలర్జీలకు దారితీసి శ్వాసకోశ సమస్యలను (Respiratory Diseases) పెంచుతుంది. ఈ నేపథ్యంలో, నెదర్లాండ్స్ ప్రభుత్వం అటువంటి ఇళ్లను ఆధునీకరించింది. ఈ క్రమంలో రిపేర్లు చేసిన ఇళ్లలో నివసిస్తున్న 1.80 లక్షల మంది ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు గమనించారు.
రిపేర్ల తర్వాత నివాసితులలో యాంటీ హిస్టామైన్ మందుల వాడకం 1.87 శాతం మేర తగ్గింది. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు పిల్లల్లో శ్వాసకోశ సంబంధిత మందుల అవసరం 3.76 శాతం వరకు తగ్గినట్లు అధ్యయనం పేర్కొంది. అంతేకాకుండా, రిపేర్లు చేసిన ఐదేళ్ల తర్వాత ఆస్తమా మందుల వాడకంలో 6.91 శాతం తగ్గుదల కనిపించింది. అయితే ఇతర ఆరోగ్య సమస్యల ఖర్చులలో పెద్దగా మార్పులు కనిపించలేదు.
గాలి నాణ్యతను పెంచడం ద్వారా శ్వాసకోశ చికిత్సల అవసరాన్ని తగ్గించవచ్చని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. కేవలం విద్యుత్ పొదుపు కోసమే కాకుండా, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కూడా గృహ పునరుద్ధరణ పథకాలను అమలు చేయాలని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ విధానం ఏయే రోగులకు అత్యంత మేలు చేస్తుందో మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.
Read Also: మహిళల్లో పెరుగుతున్న గుండెపోటు ప్రమాదం !
Follow Us On: Facebook

