కలం, కరీంనగర్ బ్యూరో: సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు ఆర్అండ్బీ రోడ్లకు మంజూర్లు ఇవ్వడంతో పాటు, ఇప్పటికే మంజూరైన రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి కోమటి రెడ్డికి పొన్నం విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేకంగా సిద్దిపేట–ఎల్కతుర్తి జాతీయ రహదారి పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రహదారిపై పెండింగ్లో ఉన్న కల్వర్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు మిట్టపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పనులు పూర్తయితే వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని మంత్రి తెలిపారు. ఎల్కతుర్తి జంక్షన్ వద్ద కరీంనగర్, హనుమకొండ, సిద్దిపేట వైపు వెళ్లే రహదారులు కలిసే ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో జంక్షన్ వద్ద రహదారిని విస్తరించి బాటిల్నెక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు.
అలాగే కరీంనగర్–ఎల్కతుర్తి, ఎల్కతుర్తి–హనుమకొండ మధ్య కొనసాగుతున్న రోడ్డు పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పొన్నం కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రోడ్డు మౌలిక వసతులు అత్యంత కీలకమని, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

