కలం, వనపర్తి: ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ (Vakiti Sridhar) ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం వనపర్తి (Wanaparthy) అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు రమేష్గౌడ్ ఆధ్వర్యంలో రైతు నిరసన సదస్సు (Farmers Protest) నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకిటి శ్రీధర్ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే పాలనపై విమర్శలు గుప్పించారు. వనపర్తి అభివృద్ధికి రూ. 2,389 కోట్ల నిధులతో పనులు చేపట్టామని ప్రభుత్వం చెబుతోందని, ఆ నిధులతో ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, ఏ కాంట్రాక్టర్లకు అప్పగించారనే వివరాలను శ్వేతపత్రం రూపంలో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూములు, జీవోల విషయంలో పారదర్శకత పాటించడం లేదని ఆరోపించారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్ విమర్శించారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించినప్పటికీ రైతులకు పూర్తి స్థాయిలో అందలేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఎల్నినో పరిస్థితులను ప్రస్తావిస్తూ రైతులను పంటల సాగు విషయంలో ప్రభుత్వం గందరగోళానికి గురిచేస్తోందని విమర్శించారు.
యూరియా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనే విధానం రైతులకు ఇబ్బందికరంగా మారుతుందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని రైతులు ఈ విధానంలో ఎలా దరఖాస్తు చేసుకుంటారని ప్రశ్నించారు. రూ.4 వేల పింఛన్ హామీ అమలులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్ ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు తదితర వర్గాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అనేక హామీలు ఇంకా అమలుకు నోచుకోలేదని, ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, రమేష్గౌడ్, మాణిక్యం, నరసింహ, మాధవరెడ్డి, మహేశ్వరెడ్డి, గులాం, తిరుమల్, పరంజ్యోతి, నెల్లస్వామి, మురళి, సాగర్, చింటూ, కవిత, శ్రీలత, జాహెబ్, రమేష్, ప్రేమ్కుమార్, హలీం, అస్లాం, ఆరిఫ్, బాలకృష్ణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

