కలం, కరీంనగర్ బ్యూరో: దేశ వ్యాప్తగా జూన్ 21న జరుగనున్న నీట్ (NEET) పరీక్షకు హాజరువుతున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హామీ ఇచ్చారు. కరీంనగర్లో మంత్రి పొన్నం నేడు మీడియాతో మాట్లాడారు. నీట్ పరీక్ష రాసే వారికి ఉచిత ప్రయాణం అందించాలని ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరారని, సీఎం దృష్టికి తీసుకెళ్లి వారికి హాల్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పొన్నం తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో అప్పటి వరకు అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు పరిష్కారించామన్నారు. పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేసి, కొత్త రూట్లలో బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణమే కాక దేశంలోనే ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. నష్టాల నుండి ఆర్టీసీ (TGSRTC) లాభాల బాటలోకి ప్రయాణిస్తోందని మంత్రి తెలిపారు.
దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా తెలంగాణ ఆర్టీసీ అని, 10 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు తాము రోజుకు రూ.200 వరకు ఆదా చేస్తున్నట్లు చెప్పారని మంత్రి వెల్లడించారు. మహిళలు హాస్పిటల్స్కి, దేవాలయాలకు ఉచితంగా వెళ్తున్నారన్నారు. ఇక ఆటో కార్మికులు ఉద్యమకారులు అని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
టెండర్ల ఆరోపణలపై హరీష్ రావుకి కౌంటర్
జిల్లా రాజకీయాల్లో గతంలో వెంకట్ స్వామి, చొక్కారావు ఎలాంటి రాజకీయాలు చేశారో ఇప్పుడు తాను, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అలాంటి రాజకీయాలు చేస్తున్నామని మంత్రి పొన్నం (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నామని, తాము అందరికీ ఆదర్శంగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరూ చూశారని చెప్పారు. సంక్షేమ శాఖల్లో మొత్తం సెంట్రల్ ప్రొక్యూర్ మెంట్ టెండర్లు రూ.2,000 కోట్లు కానప్పుడు 2 వేల కోట్ల స్కాం జరిగిందని ఎలా అంటారని మాజీ మంత్రి హరీశ్ రావును (Harish Rao) పొన్నం ప్రశ్నించారు.
టెండర్ల విషయంలో అంతా పారదర్శకంగా జరిగిందని, అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించాలనే సర్ ప్రక్రియను తీసుకొచ్చిందని పొన్నం ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సర్ ప్రక్రియపై ఇంత ఆందోళన చేస్తుంటే బీజేపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Read Also: ప్రభుత్వ బడి నుంచే సీఎం స్థాయికి.. ఆరుట్ల సభలో రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

