కలం, స్టేషన్ఘన్పూర్: పాలిటెక్నిక్ కళాశాలల విలీన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చేపట్టిన ఆందోళనకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) స్పందించారు. స్టేషన్ఘన్పూర్లో TP-JAC ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. పాలిటెక్నిక్ల ప్రత్యేక గుర్తింపును కాపాడాలని, ఇతర విద్యాసంస్థల్లో విలీనం చేయకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలోనే కొనసాగించాలని వారు కోరారు.
విద్యార్థుల విజ్ఞప్తిపై స్పందించిన కడియం శ్రీహరి.. “ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడాను. పాలిటెక్నిక్ కళాశాలలు టెక్నికల్ ఎడ్యుకేషన్లోనే కొనసాగుతాయని సీఎం హామీ ఇచ్చారు” అని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరోసారి సీఎంతో మాట్లాడి త్వరగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
“మా పాలిటెక్నిక్.. మా భవిష్యత్తు” అంటూ విద్యార్థులు నినదించారు. పాలిటెక్నిక్ల ఐడెంటిటీని కాపాడుతూ విలీనం ప్రతిపాదనను విరమించుకోవాలని TP-JAC ప్రతినిధులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో TP-JAC అధ్యక్షుడు డా. యాదయ్య, కార్యదర్శి టి. అశోక్, సెంట్రల్ ప్రతినిధి సుధర్శన్రెడ్డితో పాటు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

