కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా గజ్వేల్(Gajwel) లో రాజకీయ ఉద్రిక్తత (Political Tension) కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల మధ్య ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కేంద్రంగా రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఉదయం క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను బీఆర్ఎస్ నాయకులు తొలగించి, అదే స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను ఏర్పాటు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు, కాంగ్రెస్ నాయకులు కూడా తమ వాదనను వినిపిస్తూ, కార్యాలయ వినియోగంపై తమకున్న హక్కులను పేర్కొంటున్నారు. ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గజ్వేల్లో (Gajwel) ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. పరిస్థితిని పర్యవేక్షిస్తూ శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించారు. గజ్వేల్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయంగా కీలక నియోజకవర్గం కావడంతో ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వివాదం ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు.. తెలంగాణలో హాలిడే ప్రకటన
Follow Us On: Facebook

