కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా వేంసూర్ మండల పరిధిలో పేకాట రాయుళ్ల ఆటకట్టించేందుకు పోలీసులు ముమ్మర దాడులు చేపట్టారు. ఇందులో భాగంగానే కుంచపర్తి (Kunchaparthi) గ్రామ శివారులో రహస్యంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకున్నారు. వేంసూర్ ఎస్సై కవిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
పక్కా సమాచారంతో దాడులు
కుంచపర్తి గ్రామ శివారు ప్రాంతంలో కొందరు వ్యక్తులు చేరి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వేంసూర్ ఎస్సై కవిత తన సిబ్బందితో కలిసి ఆ స్థావరంపై బుధవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా సహించేది లేదని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. పట్టుబడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకొనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట షెడ్యూల్ ఖరారు
Follow Us On: WhatsApp

