కలం, వెబ్ డెస్క్: నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day) సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య సిబ్బందికి, ఇతర వైద్య సహాయకులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి, ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ కలిసికట్టుగా ముందడుగు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సైతం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యం అనేది ఒక ఎంపిక అని, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బలమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

