కలం, వెబ్డెస్క్: మానవ సంక్షేమం కోసం ఏఐని ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు (AI Impact Summit). సోమవారం దేశ రాజధానిలో భారత్ మండపంలో అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ను సందర్శించారు. స్టార్టప్లను చూశారు. వాటి ఫౌండర్లను కలసి మాట్లాడారు. మానవాళి అభివృద్ధికి తోడ్పడే ఆవిష్కరణలు చేయాలని కోరారు. కాగా, అంతకుముందు ‘ఎక్స్’ వేదికగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్పై ప్రధాని ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు.
సర్వజన హితాయ.. సర్వజన సుఖాయ:
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కార్యక్రమ థీమ్ను తన ట్వీట్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’ (అందరికీ మేలు, అందరికీ సంతోషం) అనే అంశం మానవాళి అభివృద్ధి కోసం కృత్రిమ మేధస్సును వినియోగించాలనే కట్టుబాటును ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ప్రపంచ నాయకులు, పరిశ్రమల ప్రతినిధులు, ఆవిష్కర్తలు, విధాన నిర్మాతలు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులను సమ్మిట్కు స్వాగతిస్తూ.. ‘ ఏఐపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడం సంతోషంగా ఉంది.’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పాలన, వ్యాపారం వంటి రంగాలను ఏఐ విస్తృతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘ఇన్నోవేషన్, సహకారం, బాధ్యతాయుత వినియోగం వంటి అంశాలపై గ్లోబల్ చర్చలకు ఈ సమ్మిట్ వేదిక అవుతుంది. ఇది ప్రగతిశీల, ఆవిష్కరణాత్మక, అవకాశాలతో నిండిన భవిష్యత్తును నిర్మించడంలో దోహదపడుతుంది’ అని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, నేటి నుంచి ఫిబ్రవరి 20 వరకు జరిగే (AI Impact Summit) ఎక్స్పోలో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్తో పాటు పలు ఆఫ్రికా దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 13 అంతర్జాతీయ పావిలియన్లు ఏర్పాటు చేశారు. 300కు పైగా ఎగ్జిబిషన్స్ ఉన్నాయి.
Read Also: అయ్యారే.. కాంగ్రెస్లో మణిశంకర్ వ్యాఖ్యల కలకలం
Follow Us On: Instagram


