కలం, వెబ్ డెస్క్ : అంతర్రాష్ట్ర జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కీలక సూచనలు చేశారు. జల వివాదాలను సహకార ధోరణితో పరిష్కరించుకోవాలన్నారు. సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించుకోవాలని కోరారు. కెన్-బెట్వా ప్రాజెక్టు ఒక ఆదర్శంగా నిలవాలన్నారు. కెన్ – బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుతో పాటు పలు అభివృద్ధి పనులను మోదీ సమీక్షించారు.
తొమ్మిది రాష్ట్రాల్లో రైల్వే, విద్యుత్, రోడ్డు రంగాలకు చెందిన సుమారు రూ. 30,000 కోట్ల విలువైన ఏడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించారు. ప్రజా ప్రాజెక్టుల అమలులో జాప్యం వల్ల వ్యయ పెరుగుతుంది తప్ప పౌరులకు అవసరమైన సౌకర్యాలు సకాలంలో అందకుండా చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక నీటి భద్రతను నిర్ధారించడానికి, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం, సమర్థవంతమైన నీటిపారుదల వంటి అంశాలను సమగ్ర పద్ధతిలో చేపట్టగల అవకాశాలను గుర్తించాలని రాష్ట్రాలకు ప్రధాని (PM Modi) సూచించారు.
కెన్ బెట్వా నదీ అనుసంధాన ప్రాజెక్టుతో పాటు స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0ను కూడా ఆయన సమీక్షించారు. విద్యుత్ రంగ ప్రాజెక్టులను సమీక్షిస్తూ, పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా నగరాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సోలార్ వినియోగాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
Read Also: వామ్మో ఎకరం రూ.237 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర
Follow Us On: Instagram

