epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నా మారని కాంగ్రెస్ : ప్రధాని మోదీ

కలం, వెబ్​డెస్క్​: కాంగ్రెస్​వి అభివృద్ధి నిరోధక రాజకీయాలు అని, అది గుర్తించిన దేశ ప్రజలు పదేపదే ​తిరస్కరిస్తున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. అస్సాంలో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్​ భారత్​ రైళ్లను వర్చువల్​గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి గెలుపు, కాంగ్రెస్​ ఘోర పరాభవం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్​ పార్టీకి చురకలు వేశారు.

‘కొన్నేళ్లుగా ఎన్నికలు స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. అదేంటంటే ఈ దేశం కాంగ్రెస్​ నెగటివ్​ పాలిటిక్స్​ను​ క్రమం తప్పకుండా తిరస్కరిస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపోల్స్​ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఏళ్ల తరబడి మహారాష్ట్రను ఏలిన కాంగ్రెస్​ ప్రస్తుతం అక్కడ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఇక ఆ పార్టీ పుట్టిన ముంబైలో అయితే ఇప్పటికే ఐదో స్థానానికి దిగజారింది. ఆ పార్టీ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయింది’ అని ప్రధాని అన్నారు.

చొరబాటుదార్లకు భూమి తాకట్టు పెట్టారు..​

ఎంతో ఘన చరిత్ర ఉన్న అస్సాంను కాంగ్రెస్​ అథోగతి పాలు చేసిందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. ఓట్ల రాజకీయాల కోసం చొరబాటుదార్లకు అస్సాం భూమిని ఆ పార్టీ తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. బోడో సమస్యకు చెక్​ పెట్టిందన్నారు. అస్సాం సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

ఫస్ట్​ చాయిస్​ బీజేపీ..

ప్రస్తుతం దేశ ప్రజల ఫస్ట్​ చాయిస్​గా బీజేపీ నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. గత ఏడాదిన్నర్రగా బీజేపీకి మద్దతు స్థిరంగా పెరుగుతోందని ఆయన చెప్పారు. ‘ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన మద్దతు లభించింది. మొట్టమొదటిసారి కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థి మేయర్​ అయ్యారు. అంతకుముందు బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పడు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకి జనం పట్టంకట్టారు’ అని ప్రధాని గుర్తుచేశారు.

అంతకుముందు రూ.6,950 కోట్లతో నిర్మించనున్న కజిరంగా ఎలివేటెడ్​ కారిడార్​ ప్రాజెక్ట్​కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్​హెచ్​–716పై కలియబోర్​–నుమాలిఘర్​ మధ్య నిర్మించనున్న ఈ కారిడార్​ అటవీ జంతువులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుందని, పర్యావరణానికి మేలు కలిగిస్తుందని ప్రధాని చెప్పారు. అలాగే గౌహతి–రోహ్​తక్​, దిబ్రూఘర్​– లక్నో మధ్య రెండు అమృత్​ భారత్​ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్​గా ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>