కలం, మెదక్ బ్యూరో : పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను దోచుకొని దాచుకోవడానికే పరిమితమైన హరీశ్ రావు, అతని అనుచరులు.. ఇప్పుడు అధికారం కోల్పోయాక తమ ఉనికిని కాపాడుకోవడానికి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ యాదవ్ (Mahender Yadav) విమర్శించారు.
నీటి పేరుతో దొంగ యాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. హరీశ్ రావుకు దమ్ముంటే నిజమైన రైతులతో కలిసి వెళ్లి కాళేశ్వరం ఎలా కూలిందో చూపించి రైతులకు క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో రెండు ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా హరీశ్ రావు మోసం చేశారని ఆరోపించారు.
తమ ఉనికిని కాపాడుకోవడానికి యాత్ర పేరుతో ఒక మనిషికి 500 రూపాయలు కిరాయి ఇచ్చి మరీ యాత్రలు చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ నిర్వాసితులకు సరైన నష్టపరిహారం ఇవ్వక వారి ఉసురు తగిలి బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యిందన్నారు.

