కలం, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత పేరుతో సీఎం చంద్రబాబు (Chandrababu) పెద్ద డ్రామా చేశారని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఫైర్ అయ్యారు. ఆరు గంటలపాటు కూటమి నేతలు వైఎస్ జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ (YSRCP) కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతిపై అసెంబ్లీ తీర్మానం పెడితే చట్టబద్దత రాదని.. చట్టబద్ధతకు శాసన మండలి ఆమోదం అవసరం లేదా? అని ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టడానికే చంద్రబాబు డ్రామాలు అంటూ దుయ్యబట్టారు. అమరావతిని చంద్రబాబు అప్పులకుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ కాదు అని.. చంద్రబాబుకు ఏటీఎంగా పనికి వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి కోసం చంద్రబాబు ఇప్పటివరకు రూ.21 వేల కోట్లు ఖర్చు చేశారని.. తాత్కాలిక అసెంబ్లీ సచివాలయం, హైకోర్టుకు ఎన్నివేల కోట్లు ఖర్చు చేశారో చంద్రబాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నిజానికి వైఎస్ జగనే అమరావతికి న్యాయం చేశారని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ హయాంలోనే అమరావతిలో రోడ్లు నిర్మాణం జరిగాయని తెలిపారు. అమరావతిపై వైఎస్ జగన్కు కోపం ఉంటే తాడేపల్లిలో ఎందుకు ఇల్లు కట్టుకుంటారని అన్నారు. అమరావతిలో పేదలకు వైఎస్ జగన్ ఇచ్చిన ఇళ్ల పట్టాలను చంద్రబాబు రద్దు చేశారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు గనులు కేటాయించాలని తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు.

