కలం, కరీంనగర్ బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు సంబంధించి కరీంనగర్ (Karimnagar) కలెక్టర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రారంభించిన ఇండ్లను పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధమయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను శనివారం ఆమె పరిశీలించారు.
లబ్ధిదారుల తుమ్మనవేణ రజిత, కుంటు రాధతో మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి ఇప్పటివరకు అయిన ఖర్చు, ప్రభుత్వం నుండి వచ్చిన బిల్లులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్, పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని అన్నారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే పరిష్కరించాలని అన్నారు. మోడల్ గ్రామాలు, మొదటి మొదటి దఫాలో ఎంపికైన లబ్ధిదారుల ఇండ్లు నూరు శాతం పూర్తయ్యేలా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు సంచాలకులు శ్రీనివాస్, డీఈ వెంకటరమణ, ఏఈ శ్రీజ, ఎంపీడీవో మల్హోత్రా, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

