కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీలో అమరావతి (Amaravathi)పై నేటి తీర్మానం.. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు శాశ్వత పునాది వేసి, వారి ఆశలకు రెక్కలు తొడుగుతోందని మంత్రి లోకేశ్ (Minister Lokesh) అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం చరిత్రలో నిలిచిపోయేదంటూ ‘జై అమరావతి’ అని నినాదాలు చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా అన్ని జిల్లాల సమగ్రాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాజధాని మహిళా రైతులపై గత వైసీపీ ప్రభుత్వ దాడి దృశ్యాలను మంత్రి సభలో చూపించారు. అమరావతిపై కీలక చర్చ జరుగుతుంటే జగన్ (YS Jagan) బెంగుళూరులో పడుకున్నాడో లేదా టీవీ చూస్తున్నాడో ఆత్మలకే తెలియాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీకి, అమరావతికి జగన్ అనుకూలమో వ్యతిరేకమో సమాధానం చెప్పాలన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని నినాదం, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. అమరావతిపై అబద్దాలు చెప్పిన జగన్.. భూ త్యాగాలు చేసిన రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాయమాటలు చెప్పి మభ్య పెట్టినందుకే జగన్ ను 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
తమ హక్కుల కోసం ఉద్యమించిన రైతులతో పాటు.. మీడియా ప్రతినిధులపైనా తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ (Minister Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అమరావతి రావాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారని ఫైర్ అయ్యారు. మహిళల్ని బూట్లతో తన్ని, జుట్టుపట్టుకుని లాగి, భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లారని ఆనాటి రోజులను గుర్తు చేశారు. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లును వ్యతిరేకించి, శాసనమండలిలో బిల్లుని అడ్డుకుంటే మండలి ఛైర్మన్ పైనే దాడికి యత్నించారని ఫైర్ అయ్యారు. ఆనాటి అరాచకాన్ని చంద్రబాబు సహా మేమంతా మండలి గ్యాలరీలో కూర్చుని చూశాం అధ్యక్షా! అంటూ సభలో ఫోటోలు ప్రదర్శించారు. మండలి ఛైర్మన్ సంతకం లేకుండానే బిల్లుని గవర్నర్ కు పంపించారని అన్నారు. జగన్ ను చూసిన పారిశ్రామికవేత్తలు ఇప్పటికీ భయపడుతున్నారని.. జగన్ మళ్లీ అధికారంలోకి రారు అని గ్యారెంటి ఇస్తారా? అని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: స్వంతంత్ర భారత్లో అతిపెద్ద ఉద్యమం అమరావతి రైతులదే: మంత్రి అనిత
Follow Us On: Instagram

