కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను (Bandi Bhagirath) వెంటనే అరెస్టు చేయాలని పీడీఎస్యూ (PDSU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ డిమాండ్ చేశారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. తన కొడుకును కాపాడుకునేందుకు బండి సంజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బండి భగీరథ్ వైఖరి పట్ల నైతిక బాధ్యత వహిస్తూ, బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదైనప్పటికీ, విచారణ చేపట్టకపోవడంతో అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. చట్టాలను పేదలపై ప్రయోగిస్తారు తప్ప, నాయకులకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి ప్రదర్శించకుండా, సిట్ విచారణ జరిపేందుకు పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సహకరించాలన్నారు. లేకుంటే బాధితురాలికి అండగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ సమావేశంలో PDSU నిజామాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్క గణేశ్, ఎల్. అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు వైష్ణవి, నసీర్, నితిన్, జిల్లా సహాయ కార్యదర్శి సృజన్, జిల్లా నాయకులు దీపిక, మహేందర్ పాల్గొన్నారు.

