కలం, వెబ్ డెస్క్: ప్రజా రాజ్యం పార్టీలో తాను ప్రారంభించిన ‘యువ రాజ్యం’ యూత్ విభాగమే 12 ఏళ్ల తరువాత జనసేనగా రూపాంతరం చెందిందని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీల నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల తరువాత ఇప్పుడు తమ కార్యకర్తలు క్షేత్ర స్థాయి బాధ్యతలు, రాజకీయ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యలపై గళం విప్పడం, జాతి నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు రాబోతున్నారని వివరించారు. తెలంగాణ యువ రాజ్యం యూత్ విభాగానికి అభినందనలు తెలిపారు. అంతేగాకుండా, 2005 నుంచి తన వెన్నంటే ఉంటూ వస్తున్నవారికి ధన్యవాదాలు చెప్పారు.
జెన్ జీ నుంచి కొత్త తరం నేతలు..
దేశానికి కొత్త తరం నాయకత్వం అవసరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నొక్కి చెప్పారు. నవ భారత్ నిర్మాణంలో జెన్ జీ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మూసధోరణి, వంశ పారంపర్య, కుల ఆధారిత, విభజిత, ప్రాంతీయ వివక్షలు చూపే రాజకీయాలను చూసి జెన్ జీ యువత కూడా విసిగిపోయిందన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తెచ్చే నేతల కోసం వారు ఎదురు చూస్తున్నారని వివరించారు. అంతేతప్ప, ప్రపంచ వేదికలపై భారత్ను బలహీనపరిచేవారిని సమర్థించబోరని స్పష్టం చేశారు.

