కలం, వెబ్ డెస్క్: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ‘ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ సారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు. అసోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని.. పశ్చిమ బెంగాల్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందన్న గట్టి విశ్వాసంతో ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారు. అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న సీఎం హిమంత్ బిశ్వశర్మ, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమికి మళ్లీ విజయాన్ని అందించిన ఎన్.ఆర్. కాంగ్రెస్ నేత, సీఎం రంగసామికి అభినందనలు’ అని తెలిపారు.
విజయ్కు అభినందనలు..
తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ‘హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక స్థానాలు రావడం, పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించడంపై మనసారా అభినందిస్తున్నా. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. అదే విధంగా కేరళలో మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్ నాయకత్వానికి, నాయకులకు అభినందనలు. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలకు పేరు పేరున శుభాభినందనలు’ అని పేర్కొన్నారు.
Read Also: తమిళనాడులో బీజేపీకి భారీ షాక్!
Follow Us On: Sharechat

