కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) పలుమార్లు ప్రచారం చేసినా తమిళనాడులో పాగా వేద్దామన్న బీజేపీ (BJP) కలకు మరోసారి ఓటర్లు చెక్ పెట్టారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఈసారి ఏఐడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. అయినా, కేవలం ఏఐడీఎంకే (AIDMK) నేతలు పోటీ ఉన్న స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉండగా.. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులంతా విజయ్ (Vijay) పార్టీ టీవీకే ధాటికి తేలిపోయారు. ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో నిలవలేకపోయారు. పార్టీ అధ్యక్షుడు నాగేంద్రన్, తమిళి సై సౌందర్ రాజన్ వంటి వారు కూడా వెనుకబడిపోయారు. దీంతో కమలం పార్టీ శ్రేణులు నిరుత్సాహపడుతున్నారు.
అన్నామలైకి టికెట్ ఇవ్వకపోవడం కారణమా..?
ఏఐడీఎంకేతో పొత్తును బీజేపీ కీలక నేత అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దీంతో, పార్టీ అధిష్ఠానం అతడిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, నాగేంద్రన్ను నియమించడం.. పార్టీ కింది స్థాయి కార్యకర్తలకు ఏమాత్రం నచ్చలేదు. చివరికి, అన్నామలైకి పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. తనే కావాలని పోటీ చేయడం లేదని అన్నామలై ప్రకటించినా.. బీజేపీ (BJP) ఉద్దేశపూర్వకంగా ఆయన్ను పక్కనపెడుతోందనే ప్రచారం ఓటర్లలోకి బలంగా వెళ్లింది. నాగేంద్రన్ నాయకత్వంలో పార్టీ ఏమాత్రం ప్రచారంలో అనుకున్నంత మేర రాణించలేకపోయింది. దీంతో పాటు సైద్ధాంతిక కారణాలు కూడా బీజేపీ అభ్యర్థులకు ప్రతిబంధకంగా మారాయి.
Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్పై భారీగా ట్రోల్స్!
Follow Us On: X(Twitter)

