కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగా వాదం బలం ఉందని.. కానీ ఏపీలో ఏపీ వాదం బలంగా ఎందుకు లేదని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రశ్నించారు. ఏపీలో కులాల కోసం కుమ్ములాటలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కులం పేరిట చేసే రాజకీయాలు పోవాలని పిలుపునిచ్చారు. అమరావతిలో బుధవారం ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
కుల దూషణలు వద్దు
కుల దూషణలు చేసుకోవడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. భారతీయ సమగ్రత కోసం జనసేన పాటుపడుతుందని చెప్పారు. ఏపీ, తెలంగాణలో పట్టభద్రులైన నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారని.. వారి కోసం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ హయాంలో కుల విభజన విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు
దేశంలో ఎవరైనా, ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కానీ ఈ హక్కులను కాలరాయడం సరికాదన్నారు. తెలంగాణలో పోటీ చేసేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసైనికులేనని పేర్కొన్నారు. అక్కడి భూమి పుత్రులే పోటీ చేస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జనసేన నాయకులు పోరు పెడితే అక్కడికి వెళ్ళానన్నారు. అంతేకాని తనకు మరో ఉద్దేశ్యం లేదని పేర్కొన్నారు. కేటీఆర్ తాను మంచి స్నేహితులమని చెప్పారు. తమ మధ్య సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుంటామని చెప్పారు.

