కలం, నకిరేకల్: మహిళల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) స్పష్టం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 4, 12, 13, 14 వార్డులకు చెందిన మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
‘ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం… ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ఏకైక లక్ష్యం’ అని ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే.. నకిరేకల్ పట్టణానికి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ మంజూరు కావడం ఆనందదాయకమైన విషయమన్నారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి నకిరేకల్ పట్టణ పర్యటనకు రానున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం (Vemula Veeresham) వెల్లడించారు.
Read Also: 2 లక్షల ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

