కలం, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సస్పెన్షన్ లో ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు (Bhujanga Rao) మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఆయనను ఏసీబీ (ACB) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ చేశారు. భుజంగరావు అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు రావడంతో బుధవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. భుజంగరావు నివాసంతో పాటు, ఆయన బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ క్రమంలో భుజంగరావు భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27.29 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు ఓపెన్ ప్లాట్లు, రెండు నివాసాలు, హైదరాబాద్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు గుర్తించారు. భుజంగరావు నివాసంలో రూ. 3.83 లక్షల నగదు, కిలో బంగారంను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖతాల్లో రూ. 8 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు రెండు కార్లు, 29 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో మద్యం సీసాలు లభించడంతో ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ మొత్తం రూ. 5.92 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉన్నారు. గతంలోనే ఆయన్ను పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనపై బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

