కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ (AP DSC) నియామకాలపై వివాదం కొనసాగుతోంది. మెరిట్ లిస్టులో అర్హత సాధించినప్పటికీ తమకు ఉద్యోగాలు రాలేదని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) వద్దకు వెళ్లి తమ సమస్యలను విన్నవించారు. అభ్యర్థులు మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తెరవెనుక “డార్క్ ఆపరేషన్” నడిచిందని, కొంతమంది ఎంపికలలో డబ్బుల వ్యవహారం జరిగిందన్న అనుమానాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతో పారదర్శకతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. తమకు న్యాయం చేయాలని, అర్హులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అభ్యర్థులు జగన్ను కోరారు. అలాగే మొత్తం డీఎస్సీ ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
అభ్యర్థుల సమస్యలను విన్న జగన్ వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు సచివాలయ ఉద్యోగాల నియామకాలలో పూర్తిగా పారదర్శకత పాటించామని, ఎటువంటి ఆరోపణలు రాకుండా ప్రక్రియ నిర్వహించామని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై చట్టపరంగా పోరాటం చేస్తామని, అవసరమైతే సీబీఐ విచారణను డిమాండ్ చేస్తామని జగన్ తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

