కలం, వెబ్ డెస్క్: నేడు తెలుగు దేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్లకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగు దేశం అని కొనియాడారు. దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన ఈ పార్టీ నాలుగు దశాబ్దాల పైబడి ప్రజా క్షేత్రంలో బలంగా నిలబడిందని పేర్కొన్నారు.
టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయని పవన్ (Pawan Kalyan) వెల్లడించారు. చంద్రబాబు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి, ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారన్నారు. రాజకీయ లక్ష్యాలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో చంద్రబాబు (Chandrababu) ముద్ర ఉందని వెల్లడించారు. కూటమి ఐక్యతతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుందని, ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు.
Read Also: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
Follow Us On: X(Twitter)

