కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్లో (Karimnagar) నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ (Lok Adalat) సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ విభాగం, సంబంధిత శాఖలు సమన్వయంతో ఫలితాలు సాధించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా లోక్ అదాలత్ నిర్వహించినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 3758 కేసులు విజయవంతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా కోర్టులపై భారం తగ్గించడంతో పాటు, ప్రజల సమయం, ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు. అదేవిధంగా, ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందుతారని, భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు. కమీషనరేట్లోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, సంబంధిత శాఖల ప్రతినిధులు సమన్వయంతో పని చేయడం వల్లే ఈ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని సీపీ పేర్కొన్నారు.

