కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మండిపడ్డారు. జనసేన పార్టీని అడ్డుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తాను జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే స్థాపించినట్టు గుర్తు చేశారు. జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. తనను అడ్డుకోవడమంటే ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించడమేనని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అయ్య జాగిరా? అంటే తప్పేంటి?
‘నన్ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తుంటే ఊరుకోవాలా?‘ అంటూ ప్రశ్నించారు. అయ్యా జాగీరా? అని మాట్లాడితే తప్పేంటని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం, బలమైన క్యాడర్, పెద్ద సంఖ్యలో సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో తనను తెలంగాణకు రావొద్దని చెప్పడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు పెరిగాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురుకాలేదని అన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయ కారణాలతో జనసేన కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి తమ కార్యకర్తలు కృషి చేస్తున్నారని, వారి రాజకీయ హక్కులను కాలరాయడానికి ఎవరూ ప్రయత్నించకూడదని హెచ్చరించారు.
ప్రాథమిక హక్కులకు భంగం
తనను తెలంగాణ రాష్ట్రానికి రావొద్దని చెప్పడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయ పౌరుడికి ఉందని, ఆ హక్కును ప్రశ్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. గత 13 నెలలుగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు, రాజకీయ దాడులు జరుగుతున్నాయని ఆరోపించిన పవన్, అలాంటి పరిస్థితుల్లో తాను స్పందిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుందని పేర్కొన్నారు.

