కలం, వెబ్ డెస్క్: పోలీస్ శాఖలో 20 వేల పోస్టులతో తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరుద్యోగులు దిల్సుఖ్నగర్ (Dilsukhnagar)లో ధర్నాకు దిగారు. దీంతో దిల్సుఖ్నగర్ మెట్రో ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ ఉద్యోగాల (Police Jobs) భర్తీపై ప్రభుత్వం నెలల తరబడి తమను మభ్యపెడుతోందని అభ్యర్థులు వాపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పలువురు నిరుద్యోగులను అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు.
ఈ సందర్భంగా పలువురు నిరుద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో 20 వేల ఖాళీలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వీటన్నింటిని భర్తీ చేస్తుందన్న నమ్మకంతో నెలల తరబడి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేయాలని భావించడం తగదన్నారు. ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు పోలీస్ శాఖలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్లు వేయాలని పేర్కొన్నారు.

